అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ఇప్పటికే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ మేరకు అమెరికా నౌకాదళానికి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య రెండోసారి చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు పాకిస్థాన్ లేదా స్విట్జర్లాండ్లో జరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా కథనాలు వివరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా రణరంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతి నెలకొల్పేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నాలుగు అంశాలను ముందుకు తెచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేత షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో బీజింగ్లో జరిగిన కీలక సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
జిన్ పింగ్ వివరించిన విషయాలను పరిశీలిస్తే.. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో సుస్థిరమైన భద్రతా వ్యవస్థను నిర్మించాలని అంటే శాంతియుత సహజీవనానికి చైనా పిలుపునిస్తోంది. శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాలని సూచించింది. అలాగే రెండో అంశం దేశ సార్వభౌమాధికారం..అంటే ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

మూడవ అంశం అభివృద్ధితో కూడిన భద్రత. ఆర్థిక ప్రగతి ఉంటేనే శాంతి నెలకొల్పడం సులభమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. ఇక చివరగా అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తమకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం సరికాదని స్పష్టం చేసింది. గత 40 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
