ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఏపీలో పెట్రో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. చాలా నగరాల్లో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. రాష్ట్రంలో సగటున 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో పరిస్థితి తలకిందులైంది. అనేక నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూలో వేచి ఉన్నారు. చాలా వరకు పెట్రోల్, డీజిల్ ట్యాంకులు కొన్ని గంటల్లోనే అయిపోయాయి.
ఈ అంశం జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా చేరింది. కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పిటిషన్లు సమర్పించే స్థాయికి పరిస్థితి వెళ్లింది. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ ఈ కేసు నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అంబులెన్స్ లకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది.

అంబులెన్స్లు, అత్యవసర వైద్య సేవలు, ప్రజా రవాణా, వ్యవసాయం, ఆహార సరఫరా సజావుగా సాగేందుకు పెట్రోల్, డీజిల్ ఎంతో అవసరమని కేతిరెడ్డి గుర్తు చేశారు. అది అందుబాటులో లేకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును హరించడమే. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు పంపినట్లు తెలిపారు.
ఇంధన నిల్వల పారదర్శకత కోసం జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వల వివరాలను వెల్లడించాలని కోరారు. పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరా మళ్లింపు, కృత్రిమ కొరత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్ విధానాన్ని అమలు చేయాలని, సెంట్రల్ లెవల్ డిజిటల్ స్టాక్ మానిటరింగ్ చేపట్టాలన్నారు.
పెట్రోల్ బంకుల్లో రియల్ టైమ్ స్టాక్ను తెలియజేసేందుకు పోర్టల్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ హెల్ప్లైన్, ఆన్లైన్ ఫిర్యాదు విధానాన్ని ప్రారంభించాలని పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ నిరంతర సరఫరా మరియు స్థానిక స్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా నిరంతరాయంగా సరఫరా జరిగేలా చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు.
