తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లేన్లుగా విస్తరించాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NHAIని కోరారు. ఈ మేరకు ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు.
NHAI చైర్మన్తో కీలక సమావేశం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో మంత్రి కోమటిరెడ్డి సమావేశమై హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ ప్రధాన అంశంపై చర్చించారు. ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు దీనిని ‘మృత్యురోడ్డు’గా పిలుస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

నాగ్పూర్ మోడల్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు వీలైనంత త్వరగా 8 లైన్ల విస్తరణ చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్-హయత్ నగర్ మధ్య 7.1 కి.మీ. పొడవునా నాగ్పూర్ మోడల్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి అందజేశామన్నారు. ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో ప్రాంతీయ రింగ్ రోడ్డు పనులు
మరోవైపు భూసేకరణ పూర్తయిన వెంటనే తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం భూసేకరణ దశలో ఉందన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రైలు, రోడ్డు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ప్రకటన
తెలంగాణలో 2014లో 2400 కి.మీ.. జాతీయ రహదారులు ఉండగా 2026 నాటికి 5000 కి.మీలకు పెంచడం గొప్ప విజయమని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యాధునికంగా తీర్చిదిద్దడంపై కూడా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ, ప్రాంతీయ రింగ్రోడ్డు పనులు త్వరగా ప్రారంభించడం వల్ల రాష్ట్ర రవాణా రంగానికి ఊపిరి పోస్తుందని అన్నారు.
