భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మను కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. కేవలం అనుమానాలు, అపోహల ఆధారంగా న్యాయమూర్తులు కేసుల నుంచి తప్పుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుంచి వైదొలగితే న్యాయవ్యవస్థ ఓటమిని అంగీకరించినట్లేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఒత్తిడికి తలొగ్గి మార్పు చేస్తారనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, అందుకే ఈ అప్పీలును తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత ఆరోపణలు న్యాయ ప్రమాణాలను ధిక్కరించవని, న్యాయస్థానం తన బాధ్యత నుంచి తప్పించుకోబోదని ఆమె స్పష్టం చేశారు.

జస్టిస్ స్వర్ణకాంత శర్మపై అరవింద్ కేజ్రీవాల్ తన పిటిషన్లో పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గతంలో తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ శర్మ తిరస్కరించారని.. అలాగే మనీష్ సిసోడియా, కె.కవిత వంటి ఇతర నిందితులకు కూడా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయలేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, జస్టిస్ శర్మ పిల్లలు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్లో న్యాయవాదులుగా ఉన్నారని, ఇది ప్రయోజనాల పరస్పర విరుద్ధమని కేజ్రీవాల్ వాదించారు.
ఈ వాదనలపై న్యాయస్థానం స్పందిస్తూ.. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులకు స్వతంత్ర వృత్తిపరమైన హక్కులు ఉంటాయని, వారి నియామకాలకు కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులను మొత్తం వ్యవస్థపై దాడులుగా పరిగణించాలని హెచ్చరించింది. కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్లు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు.
