అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసింది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి కీలకంగా మారనుందని వెల్లడించారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే.. ఇరాన్ పై అణుదాడికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అణుదాడి చేసేందుకు ట్రంప్కు పూర్తి అధికారం ఉంది. అతనికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
తాజాగా ఇరాన్కు ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని ట్రంప్ ప్రమాణం చేయడంతో.. అణుదాడికి ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం, చమురు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు వాడని ఎన్నో ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయని జేడీ వాన్స్ చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులో ఉందని… త్వరలోనే యుద్ధం ముగుస్తుందని చెప్పాడు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం అణు దాడికి ఆదేశాలు జారీ చేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఇందుకోసం అతను న్యూక్లియర్ ఫుట్బాల్ అనే సూట్ కేసు ద్వారా ధృవీకరణ కోడ్లను పంపాలి. అయితే తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇరాన్ పై అణుదాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై ట్రంప్ ఏ క్షణంలోనైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనతో సహా అమెరికా విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో.. 1 కోటి 40 లక్షల మంది ఇరాన్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ స్పందించింది. తమపై దాడి చేస్తే మరిచిపోలేని దెబ్బ తింటామని వార్నింగ్ ఇచ్చారు. తాజా పరిణామాల మధ్య పశ్చిమాసియాలో మరికొన్ని గంటలు కీలకం కానున్నాయి.
