వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
మీ అటకపై లేదా ఇంట్లో పాత పెట్టెల్లో పాత రూ.500, రూ.1000 నోట్లు దొరికాయా? ఇప్పుడు వాటిని మార్చుకోవచ్చని ఎవరైనా మీకు మెసేజ్ చేశారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ వార్త నిజం కాదు, అది పెద్ద ‘ఫేక్ న్యూస్’. పాత నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తీవ్రంగా ఖండించింది.
గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ‘ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది… పాత నోట్లు ఉన్నవాళ్లు మళ్లీ బ్యాంకుల్లో మార్చుకోవచ్చు’ అనే సారాంశంతో తప్పుడు ప్రకటన ఉంది. నవంబర్ 8, 2016న ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్ నిర్ణయం తర్వాత గడువు ముగిసి చాలా కాలం కావస్తున్నా.. ఇలాంటి వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

PIB వాస్తవ తనిఖీ: అదంతా అబద్ధం!
ఈ వైరల్ మెసేజ్పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పందిస్తూ.. “ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలు. దీన్ని ఎవరూ నమ్మవద్దని” స్పష్టం చేసింది. 2016లో రద్దయిన కరెన్సీ మార్పిడి ప్రక్రియ ముగిసిందని, ప్రస్తుతం ఆర్బీఐకి అలాంటి సదుపాయం లేదని తేల్చింది.
స్కామర్ల ఉచ్చులో పడకండి!
పాత నోట్ల మార్పిడి ద్వారా కమీషన్ పేరుతో కొందరు మోసం చేసే అవకాశం ఉన్నందున ధృవీకరించని సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. కరెన్సీకి సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం కోసం, ఎవరైనా నేరుగా RBI అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలి.
అనుమానం ఉంటే ఇక్కడ తనిఖీ చేయండి:
కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా నిర్ణయాల గురించి మీకు ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తే.. మీరు నేరుగా PIBని సంప్రదించి వాస్తవాలను పొందవచ్చు.
- వాట్సాప్ నంబర్: +91 8799711259
- ఇమెయిల్: [email protected]
RBI నిజంగా పాత ₹500 & ₹1000 నోట్లను మార్చుకోవడానికి ‘కొత్త రూల్స్’ ప్రకటించింది❓
కొన్ని వార్తా నివేదికలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (@RBI) నిలిపివేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.#PIBFactCheck
❌ ఈ దావా నకిలీది!
❌RBI అలాంటిదేమీ చేయలేదు… pic.twitter.com/8ph2mlCrLT
— PIB వాస్తవ తనిఖీ (@PIBFactCheck) ఏప్రిల్ 17, 2026
